ఎంజీఆర్ జయంతి సందర్భంగా 'తలైవి'లో ఎంజీఆర్, జయలలిత పాత్రధారులు అరవింద్ స్వామి, కంగనా రనౌత్ సరికొత్త రొమాంటిక్ స్టిల్ను రిలీజ్ చేసిన చిత్ర బృందం
'పీపుల్స్ కింగ్'గా కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ ఎం.జి. రామచంద్రన్ జయంతి సందర్భంగా 'తలైవి' చిత్ర బృందం ఆదివారం ఎంజీఆర్, జయలలిత పాత్రధారులు అరవింద్ స్వామి, కంగనా రనౌత్ జంటగా ఉన్న సరికొత్త స్టిల్ను విడుదల చేసింది. దాంతో పాటు 'తలైవి'గా జయలలిత ఎదగడంలో ఎంజీఆర్ పోషించిన పాత్రను గుర్తుచేస్తూ ఓ చిన్న వీడియో గ్లింప్స్ను కూడా రిలీజ్ చేసింది.
ఈ ఫొటోను 'తలైవి' పాత్రధారి కంగనా రనౌత్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. దాంతో పాటు, "లెజెండ్ ఎంజీఆర్ జయంతి సందర్భంగా విప్లవనాయకుడు, తలైవికి మార్గనిర్దేశకుడూ అయిన ఆయనకు నీరాజనాలు" అంటూ రాసుకొచ్చారు.
ఈ ఫొటోలో అరవింద్ స్వామి, కంగన ఒకరి కళ్లళ్లోకి ఒకరు రొమాంటిక్గా చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఎంజీఆర్ సహకారంతో జె. జయలలిత నటిగా, రాజకీయ నాయకురాలిగా ఎలా ఎదిగారనే ఇతివృత్తంతో దర్శకుడు ఎ.ఎల్. విజయ్ 'తలైవి' చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
'రోజా', 'బాంబే' లాంటి బ్లాక్బస్టర్ మూవీస్ తర్వాత 'తలైవి'తో బాలీవుడ్కు మళ్లీ వస్తున్నారు అరవింద్ స్వామి. ఎంజీఆర్గా ఆయన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్లకు వచ్చిన అనూహ్యమైన రెస్పాన్స్ తర్వాత ఇప్పుడు కంగన జతగా విడుదలైన ఫొటో 'తలైవి'పై అంచనాలను మరింతగా పెంచేసింది.
ప్రొడ్యూసర్ శైలేష్ ఆర్. సింగ్ మాట్లాడుతూ, "ఈ సినిమాకు సంబంధించి ఇదివరకు రిలీజ్ చేసిన జయలలిత పాత్రధారి కంగనా రనౌత్ లుక్కు కానీ, ఎంజీఆర్గా అరవింద్ స్వామి లుక్కు కానీ వచ్చిన అపూర్వమైన స్పందన మాలో అమితమైన ఉత్సాహాన్ని నింపింది. అంచనాలను మరింత పెంచేలా ఎంజీఆర్ జయంతి సందర్భంగా తలైవి పాత్రధారి కంగనా రనౌత్తో ఆయన రొమాంటిక్ స్టిల్ను ఇప్పుడు రిలీజ్ చేశాం. మా సినిమాపై ప్రేక్షకుల ప్రేమాభిమానాలు కొనసాగుతాయనీ, సౌత్ ఇండియన్ సినిమా, పాలిటిక్స్లో తమదైన ముద్ర వేసిన లెజెండ్స్కు మేం అర్పిస్తున్న నివాళిని స్వీకరిస్తారనీ ఆశిస్తున్నాం" అన్నారు.
విబ్రి మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్. సింగ్ సంయుక్తంగా నిర్మిస్తోన్న 'తలైవి' చిత్రానికి హితేష్ ఠక్కర్, తిరుమల్ రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎ.ఎల్. విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు.
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.