I am blessed to do ‘Om Namo Venkatesaya’ movie: Director Raghavendra Rao

'ఓం నమో వేంకటేశాయ' చిత్రం చేయడంతో నా జన్మ ధన్యమైంది
- దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు

అక్కినేని నాగార్జున.. హాథీరామ్‌ బావాజీగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి నిర్మించిన భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. ఈ చిత్రం విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకుల్ని, వేంకటేశ్వరస్వామి భక్తుల్ని విశేషంగా అలరిస్తూ విజయపథంలో దూసుకెళ్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ సెవన్‌ ఎకర్స్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, నిర్మాత ఎ.మహేష్‌రెడ్డి, హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌ పాల్గొన్నారు.

నిర్మాత ఎ.మహేష్‌రెడ్డి మాట్లాడుతూ - ''ఇంత అద్భుత విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, అభిమానులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విజయం చాలా సంతృప్తిగా వుంది. నా జన్మ ధన్యమైంది. నాకు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన రాఘవేంద్రరావుగారికి, నాగార్జునగారికి, కీరవాణిగారికి, ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. సినిమా చూసి చాలా మంది నాకు ఫోన్‌ చేసి చాలా అద్భుతమైన సినిమా తీశావు అంటుంటే ఈ జన్మకి ఇది చాలు అనిపించింది. రాఘవేంద్రరావుగారు సినిమా మొదటి నుంచి చివరి వరకు అద్భుతంగా తీశారు. హాథీరామ్‌ బాబా.. స్వామితో పాచికలాడుతుంటే నేనే ఆడుతున్న ఫీలింగ్‌ కలిగింది. నాగార్జునగారి పెర్‌ఫార్మెన్స్‌కి సెకండాఫ్‌లో 40 నిముషాలపాటు నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూనే వున్నాయి. ఒక అద్భుతమైన సినిమా చూస్తున్నానన్న ఆనంద భాష్పాలు వచ్చాయి. ఇద్దరు స్నేహితుల్లా వుండేవాళ్ళు విడిపోతున్నారన్న బాధ కలిగింది. ఈ సినిమా ద్వారా తిరుపతిలో జరిగే కార్యక్రమాలు చాలా తెలిసాయి. సాధారణంగా దర్శనం చేసుకొని వచ్చేస్తాం. కానీ, అక్కడ చూడాల్సినవి చాలా వున్నాయి. ఇవన్నీ ఈ సినిమా ద్వారా అందరికీ తెలుస్తున్నాయి. నాగార్జునగారు ఫస్ట్‌ షాట్‌ నుంచి లాస్ట్‌ షాట్‌ వరకు చాలా అద్భుతంగా చేశారు. ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుంది. నాగార్జునగారు తప్ప ఈ క్యారెక్టర్‌ ఎవ్వరూ చెయ్యలేరు. అప్పట్లో భక్తుడిగా నాగేశ్వరరావు చాలా అద్భుతమైన సినిమాలు చేశారు. ఇప్పుడు నాగార్జునగారు చేస్తున్నారు. అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయి ఒక ఎత్తయితే, ఓం నమో వేంకటేశాయ సినిమా ఒక ఎత్తు'' అన్నారు.

ప్రగ్యా జైస్వాల్‌ మాట్లాడుతూ - ''సినిమా నేను నిన్న చూశాను. ఒక గొప్ప అనుభూతిని కలిగించింది. చాలా సీన్స్‌లో నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఇంత మంచి సినిమాలో నటించినందుకు చాలా సంతోషంగా వుంది'' అన్నారు.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ''ఈ సినిమా తీసినపుడు మేం ఎలా ఫీల్‌ అయ్యామో ఈరోజు ఆడియన్స్‌ కూడా అదే ఫీల్‌తో సినిమా చూస్తున్నారు. ఎప్పుడోగానీ జన్మ ధన్యమైంది అని చెప్పం. ఈ సినిమా చేయడంతో నిజంగా నా జన్మ ధన్యమైంది. నిన్నటి నుంచి నాకు చాలా ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. అందులో రెండు మాత్రం మీకు చెప్తాను. మా బంధువుల్లో ఒకరు ఫోన్‌ చేసి ఇలాంటి సినిమా చేసి మీ జన్మ ధన్యమైంది అనుకుంటారు. కానీ, ఈ సినిమా చూసినందువల్ల మా జన్మ ధన్యమైంది, మీ కాళ్ళకు నమస్కారం అని చెప్పింది. మరొకరు ఫోన్‌ చేసి తిరుపతి క్షేత్రాన్ని వెండితెరపై ఆవిష్కరించారు అని చెప్పారు. ఇంతకన్నా ఈ జన్మకు నాకు కావాల్సింది ఏమీ లేదు. నేను ఆడియో ఫంక్షన్‌లో మామూలుగా చూస్తే విగ్రహం కనిపిస్తుంది. నాగార్జున కళ్ళతో దైవ దర్శనం కలుగుతుంది చెప్పాను. ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళకు కూడా అదే అనుభూతి కలుగుతోంది. క్లైమాక్స్‌ సీన్‌లో మొత్తం ఇసుక కవర్‌ చేసేస్తే రెండు కళ్ళతో విశ్వరూప దర్శనం చూడడం అంటే మామూలు విషయం కాదు. ఈ పాట తీస్తున్నప్పుడు ఎన్నిసార్లు కట్‌ చెయ్యలేకపోయానో నాకు తెలీదు. ఈ సినిమాతో నా జన్మ ధన్యమైంది'' అన్నారు.

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ - ''అన్నమయ్య చిత్రాన్ని ఆదరించినట్టే ఈ సినిమాని కూడా ఆదరిస్తున్నారు. దాని కంటే ఎక్కువగానే చెప్తున్నారు. చాలా ఆనందంగా వుంది. ఇంత పేరు రావడానికి కారణం రాఘవేంద్రరావుగారు. అప్పుడు అన్నమయ్య చెయ్యడంతో నా డెవోషనల్‌ జర్నీ మొదలైంది. ఇది సినిమా జర్నీయే కాదు. అప్పటి నుంచి ఒక ఇంటర్నల్‌ జర్నీ కూడా జరిగింది. దానికి రాఘవేంద్రావుగారికి థాంక్స్‌ చెప్పాలి. ఈ కథ గురించి మూడు, నాలుగు సంవత్సరాలుగా ఆయన కష్టపడుతున్నారు. ఈ సినిమా ఇంత ఎమోషనల్‌గా వచ్చిందంటే రాఘవేంద్రరావుగారు, భారవిగారు పడిన కష్టం. అందరికంటే కీరవాణిగారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఈ సినిమా అయిన తర్వాత నేను ఇంటికి వెళ్తే అమల నన్ను ఎంతగా ప్రేమిస్తోందో నాకు తెలిసింది. నన్ను వదల కుండా గంటసేపు పక్కనే కూర్చొని నన్ను చూస్తూనే వుంది. తన మనసుకి నేను ఎంత దగ్గరగా వున్నానో అప్పుడర్థమైంది. ప్రేమించుకునే టైమ్‌లో పక్క పక్కనే కూర్చుని చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు మళ్ళీ అది జరిగింది. చాలా హ్యాపీగా వుంది. సినిమా అందరికీ నచ్చింది. ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్‌'' అన్నారు.

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share

This website uses cookies.